కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ (NEET) రీఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల నేపథ్యంలో ఈ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికను అమలు చేసింది. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్, ఇతర అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి పరీక్షను సజావుగా జరిగేలా చేశారు. నీట్ రీ-ఎగ్జామ్ కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు నల్లగొండ పట్టణంలో మొత్తం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం పరీక్ష ప్రారంభమైన వెంటనే కలెక్టర్ బి. చంద్రశేఖర్ (Collector Chandrashekar) కేంద్రీయ విద్యాలయలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పరీక్ష జరుగుతున్న తీరు, అభ్యర్థులకు కల్పించిన మౌలిక వసతులు, బయోమెట్రిక్ హాజరు, పోలీస్ బందోబస్తు, తనిఖీ ప్రక్రియలను ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్తో మాట్లాడి భద్రతా ప్రమాణాలపై పలు సూచనలు చేశారు.
ఆదివారం జరిగిన ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా మొత్తం 2,065 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా.. వారిలో 1,782 మంది (86.29శాతం) అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల 283 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు నీట్ (NEET) పరీక్షల జిల్లా కో-ఆర్డినేటర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్ష సజావుగా సాగడం పట్ల అభ్యర్థుల తల్లిదండ్రులు, విద్యావర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
Read Also: చిట్చాట్లో బాంబు పేల్చిన గుత్తా
Follow Us On: Instagram

