కలం, నకిరేకల్: గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు ప్రజల మౌలిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. కట్టంగూర్ మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో గ్రామస్థుల అభ్యర్థన మేరకు రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న కల్వర్ట్, మట్టి రోడ్డు పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. పలు వీధులను సందర్శించి, స్థానిక ప్రజలతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, అంతర్గత రహదారుల దుస్థితి, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, విద్యుత్ సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన తక్షణమే స్పందిస్తూ.. ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులను ఆదేశించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాధనంతో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, పనులను గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని వేముల వీరేశం (Vemula Veeresham) ధీమా వ్యక్తం చేశారు.

