కలం, వెబ్ డెస్క్ : భారత మహిళల హాకీ (India Women Hockey) జట్టు మరోసారి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల నేషన్స్ కప్ 2025-26 ఫైనల్లో ఆతిథ్య జట్టును 2-0తో ఓడించి భారత్ ఘనంగా టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో వచ్చే సీజన్ ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో చోటు కూడా ఖరారు చేసుకుంది. మ్యాచ్ ప్రారంభమైన నాలుగో నిమిషంలోనే నవనీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి భారత్కు ఆధిక్యం అందించింది.
ఆ తర్వాత 15వ నిమిషంలో సునెలితా టొప్పో మరో గోల్ చేసి స్కోరును 2-0కు చేర్చింది. ఆ రెండు గోల్స్నే చివరి వరకు కాపాడుకుంటూ భారత జట్టు అద్భుత రక్షణాత్మక ఆటతో కివీస్కు అవకాశమే ఇవ్వలేదు. న్యూజిలాండ్ జట్టు మ్యాచ్లో ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ, భారత డిఫెన్స్ గోడలా నిలిచింది. గోల్కీపర్ సవిత కీలక సమయంలో పెనాల్టీ కార్నర్ను అడ్డుకుని జట్టు విజయాన్ని మరింత పటిష్టం చేసింది.
టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ సాధించడం విశేషం. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన లాల్రెంసియామికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా, దీపిక ఆరు గోల్స్తో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచింది. జట్టు విజయాన్ని పురస్కరించుకుని హాకీ ఇండియా ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.1.5 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది.

