కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నారాయణపేట (Narayanpet) జిల్లా బోరం బావి దగ్గర చిల్డ్రన్ హోమ్ (Children Home) లో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, కె. అవినాష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జడ్జి వింధ్య నాయక్ చిన్నారులతో కలిసి యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా వింధ్య నాయక్ మాట్లాడుతూ.. యోగ అనేది క్రమశిక్షణను నేర్పుతుందని, ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేయడం వల్ల చదువు మీద ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చిన్న వయసు నుంచే యోగాను అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఒత్తిడిని జయించి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పిల్లలకు సూచించారు.
అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ అవినాష్ మాట్లాడుతూ.. యోగా అనేది ప్రతీఒక్కరి నిత్యజీవితంలో భాగం కావాలి అని పేర్కొన్నారు. యోగా శిక్షకురాలు నర్మద చిన్నారులతో తాడాసనం, వృక్షాసనం, పద్మాసనం, భుజంగాసనం, శవాసనం వంటి సులభమైన ఆసనాలు వేయించారు. ప్రతి ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలను పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె. లక్ష్మీపతి గౌడ్, చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్ శివలీల, సిబ్బంది, 40 మంది చిన్నారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు బిస్కెట్స్, పాలు పంపిణీ చేశారు.
Read Also: భారత్ను చూసి అమెరికా నేర్చుకోవాలి.. ఫారిన్ యువతి ప్రశంసలు
Follow Us On: X(Twitter)

