కలం, వెబ్ డెస్క్: ఫాదర్స్ డే ఓ తండ్రికి జీవితాంతం మర్చిపోలేని శోకాన్ని మిగిల్చింది. భార్యభర్తల మధ్య మొదలైన కలహాలు ఆ తండ్రికి పిల్లలను శాశ్వతంగా దూరం చేశాయి. దంపతుల మధ్య జరిగిన గొడవలతో తల్లి పిల్లలకు ఎలుకల మందు పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలకు చెందిన లింగరాజు, స్వాతి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల లింగరాజు దంపతులకు కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి.
గొడవలు తీవ్రం కావడంతో స్వాతి ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. పిల్లలతో పాటు తాను సూసైడ్ చేసుకోవాలని అనుకుంది. దీంతో పిల్లలు వేదిక్ కుమార్(7), తనిష్క్(5)లకు ఎలుకల మందు తినిపించింది. ఆ తర్వాత అదే మందు తాను తిన్నది. దీంతో తల్లీ, పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. స్వాతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఫాదర్స్ డే రోజే లింగరాజుకు ఇద్దరు కొడుకులు దూరం కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

