కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో ఒక భారీ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అకస్మాత్తుగా అగ్నిప్రమాదానికి గురైంది (Electric Bus Fire). కరీంనగర్-2 డిపోకు చెందిన ఈ ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణికులతో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా.. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ (LMD) సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఒక్కసారిగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. క్షణాల వ్యవధిలోనే బస్సును పక్కకు నిలిపివేసి, అందులోని 37 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించేశారు.
డ్రైవర్ సరైన సమయంలో స్పందించడంతో ఒక పెను ప్రమాదం తప్పింది, ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే మంటలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ హఠాత్ పరిణామంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాగా, ఈ బ్యాటరీ లేదా ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడానికి గల అసలు కారణాలపై ఆర్టీసీ, పోలీస్ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.

