కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వాలు మారుతున్నా ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మాత్రం మారడం లేదు. పార్వతీపురం (Parvathipuram) మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా ప్రారంభించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు కరవయ్యాయి. వేడి నీళ్లు పడి గాయాలపాలైన ఐదేళ్ల బాలుడు బిడ్డిక జీవన్ను కుటుంబ సభ్యులు వెంటనే ఈ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ సదుపాయం కూడా అందుబాటులో లేదు. దీంతో డాక్టర్లు సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులోనే బాలుడికి ప్రాథమిక వైద్యం అందించాల్సి వచ్చింది.
బాలుడి పరిస్థితి గమనించిన వైద్యులు మెరుగైన వైద్యం అవసరమని సూచించడంతో, వెంటనే అతన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నూతనంగా నిర్మించి, ఘనంగా ప్రారంభించిన ఆసుపత్రిలో కనీసం విద్యుత్, జనరేటర్ వంటి అత్యవసర సదుపాయాలు కూడా లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించినా, వైద్యం దక్కకపోతే ఎలాగని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

