కలం, వెబ్డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport)లో ఒకేసారి 20 మంది మహిళలు అరెస్ట్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఒమాన్ ఎయిర్ లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్కు వచ్చిన ఈ మహిళలను అధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలు ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఒక ఏజెంట్ను సంప్రదించి పని మాట్లాడుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే ఎయిర్ పోర్ట్లో తనిఖీలు చేపట్టిన ఇమ్మిగ్రేషన్ అధికారులు వీరి వద్ద ఉన్నవి నకిలీ వీసాలు (Fake Visas) అని గుర్తించారు. దీంతో వారిని తదుపరి విచారణ నిమిత్తం ఎయిర్ పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. అయితే మహిళలు తాము ఏ తప్పు చేయలేదని, తమను ఏజెంట్ మోసగించాడని చెప్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

