కలం ,కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలం అనంతారం (Anantharam Village) గ్రామంలోని ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ (Dava VasanthaSuresh) బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పంట చేతికొచ్చి సుమారు 20 రోజులు గడిచినా, కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే 15 రోజుల క్రితమే ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు.
ఎన్నికల సమయంలో రైతు డిక్లరేషన్ పేరిట పెద్దపెద్ద హామీలు ఇచ్చి, ఇప్పుడు రైతులు పండించిన పంటనే కొనుగోలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆమె ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అయిల్నేని ఆనంద్ రావు, మోహన్, శ్రీపాల్, జలంధర్, రాజమల్లు, మల్లేశం, గంగాధర్, తిరుపతి, సత్తన్న, భాగ్య, మల్లయ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

