కలం, కరీంనగర్: శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ (Karimnagar) లోని భగత్ నగర్, కాశ్మీర్ గడ్డ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయా మండపాలలో స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందజేశారు.
కాశ్మీర్ గడ్డ ప్రాంతంలో ఫండస్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని, శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడిని, అలాగే భగత్ నగర్లో అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఆదర్శ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. బొజ్జ గణపయ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలను నగర ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీదేవి చంద్రమౌళి, ఫండస్ స్కూల్ యాజమాన్యం పద్మజ ప్రభాకర్ రెడ్డి, కపిలేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు కస్తూరి నాగరాజు, కేశవరెడ్డి, శంకరయ్య, కనకయ్య , ఆదర్శ్ యూత్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

