కలం, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లా రాయచోటిలో(Rayachoty) భూమి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానికంగా నివసిస్తున్న వీరనాగమ్మ అనే మహిళ తన ఇంటిని అక్రమంగా కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కన్నీరుమున్నీరైంది. తన భర్త సంతకాలను ఫోర్జరీ చేసి, రెండో భార్య పేరుతో స్థలం రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఆ ఆస్తిని వైసీపీ నేత ఖాజా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆమె ఆరోపించింది.
ఈ వివాదం అక్కడితో ఆగకుండా, ఖాజా సుమారు 20 మంది మహిళలను తీసుకుని తన ఇంటిపై దాడి చేయించాడని వీరనాగమ్మ వాపోయింది. రాళ్లతో దాడి చేయడం, ఇంటి తాళాలు పగలగొట్టడం మాత్రమే కాకుండా, ప్రాణహానీ బెదిరింపులు కూడా చేశారని ఆమె తెలిపింది. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన కుటుంబం రక్షణ కోసం అధికారులను ఆశ్రయిస్తోంది. తమకు న్యాయం చేయాలని, భద్రత కల్పించాలని బాధితురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును (Chandrababu) వేడుకుంది. ఇలాంటి దౌర్జన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కుటుంబాన్ని రక్షించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

