కలం, స్పోర్ట్స్ : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) సీనియర్ జట్టులో అవకాశం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం అఫ్గానిస్థాన్తో జరిగిన చివరి టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు కొత్తగా జట్టులోకి వచ్చిన వారితో పోలిస్తే ప్రాధాన్యత ఉంటుందని గంభీర్ తెలిపారు.
వైభవ్ సూర్యవంశీ వద్ద అద్భుతమైన ప్రతిభ ఉందని పేర్కొన్న ఆయన.. జాతీయ జట్టులో అవకాశం లభించినప్పుడు అతనికి తగినన్ని అవకాశాలు ఇస్తామని చెప్పారు. అయితే వయసుతో సంబంధం లేకుండా జట్టులో పోటీని ఎదుర్కొంటూ అవకాశం కోసం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు.అఫ్గానిస్థాన్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లోనూ వైభవ్కు తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్కు గంభీర్ మద్దతుగా నిలిచారు. ఇంగ్లండ్ సిరీస్లో సామ్సన్ను పక్కన పెట్టడం తన కోచింగ్ కెరీర్లోనే అత్యంత కష్టమైన నిర్ణయమని ఆయన గుర్తుచేశారు. ప్రపంచకప్లో విజయాన్ని అందించిన కాంబినేషన్పైనే మరోసారి నమ్మకం ఉంచినట్లు తెలిపారు.
అఫ్గానిస్థాన్తో జరిగిన చివరి టీ20లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 221 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ కేవలం 34 బంతుల్లోనే 108 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత బౌలర్లు అఫ్గానిస్థాన్ను 94 పరుగులకే ఆలౌట్ చేయడంతో భారత్ 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్పైనా గంభీర్ మాట్లాడారు. ఆసియా క్రీడల షెడ్యూల్ కారణంగా ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఆకిబ్ నబీ, నమన్ ధీర్ వంటి యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.

