కలం, వెబ్ డెస్క్: తడిసిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.84 లక్షల మంది రైతుల నుంచి సుమారు 14.40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ఆయన వెల్లడించారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ. 2,001.96 కోట్లను జమ చేశామన్నారు. చెల్లింపుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం (Wet Paddy) విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, నిబంధనలను సడలించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వాటిని వెంటనే పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన వెంటనే నగదు జమ చేయాలని యంత్రాంగాన్ని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.

