కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) జిల్లా శాలీగౌరారం మండలంలోని లింగోటం గ్రామంలో బుధవారం తీవ్ర కలకలం రేగింది. ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరు యువకులు, ఆమె తమ ప్రేమను నిరాకరించిందనే మనస్థాపంతో బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి (Suicide) పాల్పడ్డారు. లింగోటం గ్రామానికి చెందిన కోనేటి అఖిల్, లోడే పవన్ అనే ఇద్దరు యువకులు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నారు.
అయితే, ఇది ఇద్దరి వైపు నుంచి ఉన్న ‘వన్ సైడ్ లవ్’ అని తెలుస్తోంది. సదరు యువతి వీరిద్దరి ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన అఖిల్, పవన్ ఒకేసారి పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడటంతో లింగోటం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

