కలం, నిర్మల్: కాసేపటి క్రితం ఇంటి బాల్కనీలో ఆడుకుంటూ కనిపించిన చిన్నారి.. క్షణాల్లోనే విగతజీవిగా మారడంతో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నిర్మల్ జిల్లా భైంసా (Bhainsa) పట్టణంలోని రాహుల్ నగర్లో శుక్రవారం ఈ హృదయవిదారక ఘటన జరిగింది. రాజస్థాన్కు చెందిన మాధవ్ సింగ్ – ప్రియాంక దంపతులు ఉపాధి కోసం వచ్చి భైంసాలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
ఈ దంపతులకు రెండేళ్ల కుమార్తె కీర్తి సింగ్ ఉంది. వీళ్లు ఇంటి రెండో అంతస్తులో నివసిస్తున్నారు. రెండో అంతస్తు బాల్కనీలో ఆడుకుంటున్న కీర్తి ప్రమాదవశాత్తు కిందపడింది. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఆడిపాడాల్సిన వయసులోనే కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

