కలం, వెబ్ డెస్క్ : షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడలో జరిగిన ఆరుగురి హత్యల కేసు తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ చీఫ్ కవిత (TRS Chief Kavitha) ఈ దారుణంపై ఎక్స్ వేదిక స్పందించారు. ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని అని ఆమె డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగరంలో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో ఆరుగురి హత్య జరగడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఫోక్సో కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన నిందితుడు హత్యలు చేస్తుంటే నిఘా వ్యవస్థ, పోలీసులు ఆపలేకపోవడం దారుణం అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
భార్య, పిల్లలతో సహా ఆరుగురిని దారుణంగా చంపిన క్రూర నేర ప్రవృత్తి ఉన్న నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరుగురి హత్యలకు హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు.

