కలం, వెబ్ డెస్క్ : నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, చిన్నతనం నుంచే పిల్లల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు సరికొత్త అడుగు పడింది. ఉప్పల్ భగాయత్లో 2600 గజాల విస్తీర్ణంలో రూ.1.80 కోట్ల భారీ వ్యయంతో ఒక అత్యాధునిక ‘చిల్డ్రన్ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కు’ (Childrens Traffic Training Park)ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ పార్కులో పాఠశాల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో రోడ్లు, సిగ్నల్స్, జంక్షన్ల నమూనాలను అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, చిన్నారులకు ఇక్కడ ప్రాక్టికల్గా శిక్షణ ఇవ్వడం ఈ పార్కు యొక్క ప్రధాన ఉద్దేశం. నిబంధనలను ఎలా పాటించాలి, సిగ్నల్స్ పడినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాలపై చిన్న వయసులోనే అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ సరికొత్త ప్రాజెక్టు త్వరలోనే అందుబాటులోకి రానుంది.

