కలం, నిర్మల్: ఉపాధ్యాయులు, ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) ఆధ్వర్యంలో ఆగస్టు 1న హైదరాబాద్లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శనివారం సమావేశం నిర్వహించి మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే 317 జీవో బాధితులకు న్యాయం చేయాలనీ పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలన్నారు. తపస్ చేపట్టిన దశలవారీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 1న నిర్వహించే మహాధర్నాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రాష్ట్ర బాధ్యులు రాజేశ్వర్, జిల్లా నాయకులు ముత్యం, అశోక్, ఆర్. రాజేశ్వర్, వాసుదేవ రెడ్డి, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

