కలం, ఖమ్మం బ్యూరో : ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థుల పోరాటం, వారు సాధించిన విజయం ఒక చెంపపెట్టు లాంటిదని తెలంగాణ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) ఘాటుగా విమర్శించారు. శనివారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో విద్యార్థుల విజయాన్ని దేశంలో రాబోయే మార్పుకు స్పష్టమైన సంకేతంగా అభివర్ణించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు సాధించిన విజయం కేవలం ఒక్క సమస్య పరిష్కారానికే పరిమితం కాలేదని, దేశంలో గుణాత్మక మార్పును కోరుకునే యువత ఆకాంక్షలకు, వారి దృఢ సంకల్పానికి ఇది ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ఆశయాలను పూర్తిగా పక్కనబెట్టి పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఉద్యమ విజయం ఒక హెచ్చరిక అని అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వాలను ప్రజలు ఎంతమాత్రం సహించరని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి నిరూపించిందని స్పష్టం చేశారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకుని విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూల దృక్పథంతో స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమంతో పాటు విద్యా రంగ అభివృద్ధికి, కొత్త ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

