కలం, ములుగు : ములుగు (Mulugu) జిల్లా మంగపేట (Mangapet) మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షంతో పాటు టోర్నడోను తలపించే సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. మంగపేట నుంచి కోమటిపల్లి వెళ్లే రహదారి వెంట ఉన్న అటవీ ప్రాంతంలో భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా నేలకొరిగాయి. గాలుల ధాటికి పలు చెట్లు రోడ్డుపై పడిపోవడంతో మంగపేట–కోమటిపల్లి మధ్య రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, స్థానికులు కలిసి రోడ్డుపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. సుమారు రెండు ఎకరాల పరిధిలో భారీ వృక్షాలు నేలకొరిగినట్లు అధికారులు గుర్తించారు. సమీపంలోని ప్లాంటేషన్లో జామాయిల్ చెట్లు కూడా విరిగిపోవడంతో నష్టం సంభవించింది. సుడిగాలి మేఘంలా చెట్లపైకి దూసుకొచ్చిందని, చెట్లు ఒక్కసారిగా విరిగి పడుతుండటంతో భయాందోళనకు గురయ్యామని సమీపంలోని రైతులు, స్థానికులు తెలిపారు. ఇటీవల మేడారం ప్రాంతంలో జరిగిన ఇలాంటి ఘటనను గుర్తు చేసుకుంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

