కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఈద్గాం కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 తులాల బంగారం, నగదును అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబం 15 రోజుల క్రితం కాశీ యాత్రకు వెళ్లగా సోమవారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంట్లోని బెడ్రూమ్లో బీరువా తెరిచి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అనుమానంతో పరిశీలించగా అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి క్లూస్ టీం సిబ్బందితో దుండగుల వేలిముద్రలను సేకరించారు. ఇంటి ప్రధాన ద్వారం తాళం వేసినట్లే ఉండగా, వంటగది తలుపు తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు తారక శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

