కలం, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో డిజిటల్ మీడియా(Digital Media) విస్తృతి పెరిగిందని, ప్రభుత్వ వ్యవహారాలతో పాటు సమాచారాన్ని షేరింగ్ చేయడమూ పెరిగిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వ్యాఖ్యానించారు. సంప్రదాయ మీడియా స్థానంలో డిజిటల్ విధానం కూడా విస్తరించిందన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని డిజిటల్ మీడియా కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ పాలసీలో ఏయే అంశాలు ఉండాలో నిర్దిష్టమైన మార్గదర్శకాలు కూడా తయారవుతాయన్నారు. రెండు మూడు నెలల్లోనే ఈ పాలసీపై స్పష్టత వస్తుందన్నారు. దీన్ని ఏయే అవసరాలకు ఎలా ఉపయోగించాలి, ప్రజలకు సత్వరంగా సులభమైన సేవలను ఎలా అందించగలుగుతాం.. ఇలాంటి అంశాలన్నీ ఆ పాలసీలో ఉంటాయన్నారు. శాసనమండలిలో సభ్యులు లేవనెత్తిన అంశానికి మంత్రి పై విధంగా క్లారిటీ ఇచ్చారు.
జర్నలిస్టుల్లో ‘డివైడ్’ ఆలోచన లేనే లేదు :
జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలిలో మంత్రి స్పందిస్తూ.. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు లేదా గుర్తింపులో ‘డివైడ్ అండ్ రూల్’ అనే అంశమే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. వారి సంక్షేమం, హక్కులు, భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని నొక్కిచెప్పారు. అక్రిడేషన్ కార్డుల జారీ అంశంలోనూ కొంతమంది ఉద్దేశపూర్వకంగానో లేక అవగాహన లేకపోవడంతోనో ఆందోళన పడుతున్నారని, అపోహలను కూడా సృష్టిస్తున్నారని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ అవుతాయన్నారు. ఎలాంటి భేషజాలాలకు తావు లేకుండా మొదట్లో విడుదల చేసిన జీవోపై జర్నలిస్టుల సంఘాలన్నింటి అభిప్రాయాలను, సూచనలను తీసుకొన్నామని, దానికి తగినట్లుగా కొన్ని మార్పులు కూడా చేశామని వివరించారు. డెస్క్ జర్నలిస్టులు, మరో కోవకి చెందిన జర్నలిస్టులు.. ఇలాంటి తేడాలేవీ ప్రభుత్వానికి లేవన్నారు. ఇండ్ల స్థలాల విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. లీగల్ చిక్కుల్లేకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు.

