కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కొద్ది సేపట్లో తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Talli Statue) ఆవిష్కరణ జరుగనుంది. పునరుద్ధరించిన కౌన్సిల్ భవనం ముందు ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని రాష్ట్ర గౌరవ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు గవర్నర్ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం ముగిసిన వెంటనే, శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ కూడా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు శాసనసభ, శాసనమండలి సెక్రటరీలు ఇప్పటికే సభ్యులందరికీ అధికారిక సమాచారం అందించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం అసెంబ్లీ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

