కలం, వెబ్ డెస్క్: పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో రేపు (బుధవారం) జరగాల్సిన విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ శాసనసభ స్పీకర్ (Telangana Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
రేపు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటంతో విచారణను వాయిదా వేయాల్సి వచ్చినట్లు సమాచారం. శాసనసభ కార్యాచరణ, ఎన్నికల ప్రక్రియలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో పిటిషనర్లు, ప్రతివాదులు తమ తమ వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. ఎల్లుండి ఇరు వర్గాల తుది వాదనలు విననున్నట్లు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. తుది వాదనలు పూర్తయిన అనంతరం స్పీకర్ నిర్ణయం వెలువడే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపు కేసు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై అన్ని పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది.

