కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రేపటి నుంచి తలపెట్టాలనుకున్న సమ్మె నిర్ణయాన్ని గిగ్ వర్కర్ల సంఘం (Gig Workers Strike) తాత్కాలికంగా వాయిదా వేసింది. తమకు కనీస ఛార్జీలు పెంచాలని , వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా కార్మికులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం ( ఆగస్టు 8) నుంచి సమ్మెకు దిగుతామని.. ఆ రోజు నుంచి రాపిడో, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్స్టామార్ట్ వంటి సేవలు బంద్ అవుతాయని టీఏడీఎఫ్ ప్రకటించింది.
దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. మంత్రి వివేక్ తో టీఏడీఎఫ్ నాయకులు సంప్రదింపులు జరిపారు. ఈ నెల 15 నాటికి కొత్త రూల్స్ తీసుకొస్తామని మంత్రి వివేక్ వారికి హామీ ఇచ్చారు. సమ్మెకు వెళ్లొద్దని మంత్రి చేసిన విజ్ఞప్తి మేరకు టీఏడీఎఫ్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. బేస్ప్రైస్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తమకు హామీ ఇచ్చారని టీఏడీఎఫ్ తెలిపింది. ప్రస్తుతానికి సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

