కలం, యాదగిరిగుట్ట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) బుధవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (YTDA) ఎక్స్-అఫీషియో సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ప్రధానాలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో ఆలయ ఈఓ భవానీ శంకర్ సీఎస్ సంజయ్ జాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం స్వామివారి దర్శనం, వేద పండితులు వేదమండపంలో వేదాశీర్వచనం అందజేశారు. తర్వాత ఆలయ ఈఓ భవానీ శంకర్ స్వామివారి ప్రతిమతో పాటు తీర్థ ప్రసాదాలను సీఎస్ సంజయ్ జాజుకు అందించి సత్కరించారు. ఇంతకుముందు యాదగిరిగుట్ట అతిథి గృహానికి చేరుకున్న సీఎస్కు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అక్షాంష్ యాదవ్ పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆలయ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

