కలం, నిర్మల్ : గత కొద్ది రోజులుగా వర్షాలు లేక నీటి ప్రవాహం తగ్గిన సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు (Swarna Project)కు మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో మళ్లీ జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,047 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ప్రస్తుతం 1,172.5 అడుగుల నీటిమట్టం నమోదైందని వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే ప్రాజెక్టులోకి మరింత నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

