కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట(Suryapet) కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికల బీఫామ్ల కోసం గందరగోళం నెలకొంది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కాకుండా ఇతర నాయకులకు టికెట్లు ఇస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్(Congress) పార్టీ టికెట్ల కేటాయింపులో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. సూర్యాపేట మున్సిపాలిటీలోని రాయినిగూడెం 11వ వార్డు టికెట్ను ఎలుగూరి ఇందిరకు కేటాయించాలని ఇటీవల జిల్లా కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 25వ వార్డును కోడి శివకు కేటాయించాలంటూ సూర్యాపేట జిల్లా కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే కోడి శివ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని, అందువల్లే తనకు టికెట్ రావడంలేదని వాపోయారు.


