కలం, వెబ్డెస్క్: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) దంపతులు విడాకులు తీసుకోవడానికి సుప్రీం కోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒమర్ అబ్దుల్లా 1994లో పాయల్ అబ్దుల్లాను వివాహం చేసుకున్నారు. అయితే పలు వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ 2011 నుంచి విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్ట్, ఢిల్లీ కోర్ట్లను ఆశ్రయించారు. కానీ, పలు కారణాలతో విడాకులు మంజూరు కాలేదు.
ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పరస్పర అంగీకారంతో వివాహ బంధం రద్దు చేసుకోవాలని అనుకుంటున్నామని, దీనికి అంగీకరించాలని కోర్టును కోరారు. ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఇద్దరూ పరస్పర అంగీకార నిబంధనలను సమర్పించారని, పెండింగ్లో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకుంటారని తెలిపారు.

