కలం, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురుగాలులు ఆలయ ప్రాంగణంలో బీభత్సం సృష్టించాయి. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాటు చేసిన భారీ క్యూలైన్ టెంట్లు ఈదురుగాలుల ధాటికి తట్టుకోలేకపోయాయి. గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో టెంట్లకు ఉన్న ఇనుప ఊచలు, పిల్లర్లు ఒక్కసారిగా ఊడిపోయి పైకి లేచాయి.
టెంట్లు కూలిపోయే సమయానికి వాటి కింద భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం.. టెంట్ల ఊచలు ఊడి పడుతుండటంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. టెంట్ల కింద ఉన్న భక్తులు ఒక్కసారిగా చెల్లాచెదురవడంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

