కలం, వెబ్ డెస్క్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం (Srisailam)లో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారీగా తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. శ్రీశైలంలో రోజూ రద్దీ సాధారణమే అయినప్పటికీ నేడు శివరాత్రి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇక ఆదివారం రాత్రి 2 గంటలకే భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆలయంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం నందివాహన సేవ, ఆలయ ఉత్సవం జరుగనున్నాయి. రాత్రి 10 గంటలకు రుద్రాభిషేకం చేయనున్నారు. ఈ రోజు రాత్రి 12 గంటలకు పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం జరిపి, సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకు భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.


