కలం, నిజామాబాద్ బ్యూరో : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) క్రమంగా జలకళ సంతరించుకుంటుంది. 80 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు మంగళవారం రాత్రి 10 గంటల వరకు 35 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం 28 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా 1076 అడుగులు, 35.057 టీఎంసీల నీటిమట్టానికి చేరుకుంది.
అయితే తాగు సాగు నీటి అవసరాల కోసం 934 క్యూసెక్కుల నీటిని పంపు హౌస్ ల ద్వారా కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు.. గత నెల మూడో వారం వరకు డెడ్ స్టోరేజ్ లో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చెప్పుకోదగ్గ స్థాయిలో కాకున్నా ఆశించిన స్థాయిలో క్రమంగా నిండుతుండడంతో రైతన్నల్లో ఆశలు చిగురుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ప్రతి ఏటా ఆగస్టు చివరి నాటికి అలాగే సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి నిండుకుండలా మారుతుంది. కానీ జూన్ నుంచే వరదలు వస్తాయి. ఎల్ నీ నో ప్రభావంతో వరదలు పూర్తిగా రాలేదు. వారం పది రోజులుగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో వరద రావడంతో ఈ మాత్రం ప్రాజెక్టు నిండింది. ప్రాజెక్టు త్వరగా నిండాలని రైతన్నలు కోరుకుంటున్నారు.

