ఆ భేటీ రహస్యం కాదు : శ్రీధర్ బాబు క్లారిటీ

కలం, వెబ్ డెస్క్: మంత్రులు రహస్యంగా భేటీ అయ్యారంటూ ఇటీవల కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ భేటీపై మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu)  క్లారిటీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంతో మంత్రుల భేటీలో రహస్యం ఏమీ లేదని.. ఆ భేటీ బహిరంగమేనని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతి చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ రహస్య భేటీ అంటూ విష ప్రచారం చేయడం తగదని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు కావాలనే పని గట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

“ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ అనేది ఒక యూనిట్. పాలనాపరమైన అంశాల్లో ఎక్కడా జాప్యం ఏర్పడకుండా ఉండటానికి సీనియర్ మంత్రులుగా మేం చర్చించుకుంటే అందులో తప్పేముంది? అది ప్రభుత్వ సమష్టి బాధ్యత. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసంలో మేము భేటీ అయ్యి పాలనాపరమైన అంశాలను చర్చించాం” అని స్పష్టం చేశారు. “లోక్ భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి ముందే మేమంతా ఒకే కారులో వెళ్లాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాం.‘  అంటూ శ్రీధర్ బాబు (Sridhar Babu) పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికల సన్నద్ధత అనేది రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత. దీనికి కూడా లేనిపోని రంగులు పూయడం సమంజసం కాదు” అని అన్నారు. “నిర్మాణాత్మకమైన విమర్శలను మేము ఎప్పుడూ స్వాగతిస్తాం. కానీ వ్యక్తిత్వ హననానికి, ఊహాజనిత కథనాలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. రాష్ట్రాభివృద్ధి కోసం… భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న మా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం ఇకనైనా మానుకొని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి” అని కోరారు.

Read Also: అవును.. కలిశాం.. తప్పేంటి?.. సీఎం లేనందునే మేం డిస్కస్ చేశాం : భట్టి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>