కలం, వెబ్ డెస్క్ : అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వాలని కోరిన తనను సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉండే ఓ వ్యక్తి గెస్ట్హౌస్కు రావాలని పిలిచారని మహిళా వ్యాపారవేత్త కె. శోభారెడ్డి (Shobha Reddy) ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఔట్డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో మూడేళ్లుగా చట్టబద్ధమైన, సమాన వ్యాపార అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లు మిథున యాడ్స్ ప్రొప్రైటర్ శోభారెడ్డి తెలిపారు. రెగ్యులర్ టెండర్లు వచ్చే వరకు రెవెన్యూ షేరింగ్ విధానంలో తాత్కాలిక అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు చెప్పారు.
తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా భావించిన వ్యక్తిని సంప్రదించగా, గెస్ట్హౌస్కు వచ్చి మాట్లాడాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఎవరి పేర్లను వెల్లడించలేనని, తనకు ప్రత్యేక ప్రయోజనం అవసరం లేదని.. చట్టబద్ధమైన అవకాశం, సమానత్వం, గౌరవం మాత్రమే కావాలని స్పష్టం చేశారు.
అడ్వర్టైజ్మెంట్ నిర్మాణాలకు సంబంధించి నోటీసులు, పెండింగ్ కంప్లయన్స్ అంశాలు ఉన్నప్పటికీ కొన్ని నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని శోభారెడ్డి కోరారు.

