కలం, కరీంనగర్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉప ఎన్నికను ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లిందని విమర్శించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో అసలు పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ను అసహ్యించుకుంటున్నారని, ఆ పార్టీ తమకు అసలు పోటీనే కాదని స్పష్టం చేశారు. దానం నాగేందర్ తనను తాను ఖైరతాబాద్ వినాయకుడితో పోల్చుకోవడం హాస్యాస్పదమన్నారు. ఈ మేరకు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్కు రాజకీయ నిమజ్జనమే!
వినాయకుడిని నవరాత్రుల చివర్లో నిమజ్జనం చేస్తారనే విషయం దానం గుర్తుంచుకుంటే మంచిదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, దానం నాగేందర్ రాజకీయాన్ని ప్రజలు నిమజ్జనం చేయడం తథ్యం అని జోస్యం చెప్పారు.

