కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ఫాంహౌజ్ సందర్శనకు వెళ్లడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. “కేసీఆర్ ఫాంహౌజ్ ఏమైనా టూరిజం కేంద్రామా? ప్రైవేట్ భూములను సందర్శించడానికి అధికార పార్టీకి ఏం హక్కు ఉంది?” అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు వెళ్తే అర్థం చేసుకోవచ్చని, చేతిలో అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ భూములుంటే అధికారులను పంపి వెంటనే స్వాధీనం చేసుకోవాలని సవాలు విసిరారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు భయపడి కాంగ్రెస్ పార్టీ అనర్హత కేసులో స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని ఉద్ఘాటించారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
22ఏ పై న్యాయపోరాటానికి సిద్ధం..
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు 22ఏ (Prohibited Lands) చట్టాన్ని తమ రాజకీయ, వ్యక్తిగత స్వార్థానికి అనుకూలంగా వాడుకుంటూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే 22ఏ సమస్యను పరిష్కరించకపోతే క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి కార్యాచరణ చేపడతామని, అవసరమైతే న్యాయపరమైన పోరాటం కూడా చేస్తామని హెచ్చరించారు.

