కలం మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం ‘షీ-టీమ్స్’ (SHE Teams) కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్ నెలలో ఈవ్టీజింగ్ (Eve Teasing) కు పాల్పడిన వారిపై 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు మెదక్ ఎస్పీ వెల్లడించారు. షీ-టీమ్స్ ద్వారా జిల్లాలోని తూప్రాన్ సబ్డివిజన్లో 16 మంది, మెదక్ సబ్డివిజన్లో 40 మంది మొత్తం 56 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. షీ–టీమ్స్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, బస్స్టాప్లు, రద్దీ ప్రాంతాల్లో 40 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
ప్రగతిపాలన కార్యక్రమంలో భాగంగా మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, బాల్యవివాహాల నిరోధంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎవరైనా మహిళలను వేధించినా, అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్ 100 లేదా షీ–టీమ్ వాట్సాప్ నంబర్ 8712657963కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండకముందే బాలికల వివాహాలు జరిగితే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పనిచేస్తోందని, మానవ అక్రమ రవాణా, ఆర్గనైజ్డ్ నేరాలపై సమాచారం అందించాలని ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

