కాంగ్రెస్ vs బీఆర్ఎస్.. సంగారెడ్డిలో రోడ్డు విస్తరణ దుమారం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్డు (Sangareddy Bypass Road) విస్తరణ అంశం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, రాబోయే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డును నిర్మించాలనే అంశం చుట్టు రాజకీయాలు జరుగుతుంది. అయితే, ఈ ప్రజా అవసరాన్ని పక్కనపెట్టి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు తమదే పైచేయి సాధించడానికి చేస్తున్న ఆధిపత్య పోరు ఎటు దారితీస్తుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

రద్దీ రోడ్డు విస్తరణ..

సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలికేలా సంగారెడ్డిలోని ముఖ్య‌మైన బైపాస్ రోడ్డు (Sangareddy Bypass Road) విస్తరణ పనులను హెఎండీఎ శ్రీకారం చుట్టింది. ఇన్‌స్పెక్షన్ బంగ్లా (R&B గెస్ట్‌హౌస్) నుండి సాయిబాబా కమాన్ మీదుగా బసవేశ్వర విగ్రహం వరకు, అలాగే జాతీయ రహదారి (NH-65)ని అనుసంధానించేలా ఈ రహదారి విస్త‌ర‌ణ ప‌నులు, అభివృద్ధి పనులు చేపట్ట‌ల‌ని నిర్ణ‌యించారు.

సంగారెడ్డి పట్టణం బాగా విస్త‌రించ‌డంతో బైపాస్ రొడ్డుకు ఇరువైపుల పెద్దఎత్తున కాల‌నీలు నిర్మాణం కావ‌డంతో నిత్యం వేలాది మంది ఈ రొడ్డు పై రాక‌పోక‌లు సాగిస్తుంటారు. ఏ స‌మ‌యంలో చూసిన ర‌ద్దీతో ఉటుంది. సంగారెడ్డి ప‌ట్ట‌ణంకు సంబంధించి బైపాస్ రొడ్డు ప్ర‌దాన ర‌హ‌దారిగా ఉంది.

దింతో పెరుగుతున్న ర‌ద్దీ, భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ కోసం ఐబీ గెస్ట్ హౌస్ నుంచి సుమారు 2.5 నుండి 2.6 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని 80 అడుగుల (24.4 మీటర్లు) వెడల్పుతో 4 లేన్ల రహదారిగా అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించారు. సంగారెడ్డి బైపాస్ రొడ్డు విస్తరణ పనుల కోసం రూ.18 కోట్ల నిధులతో అభివృద్ధి చేయాల‌ని ప్ర‌ణాళిక‌ను రూపొందించారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో ఈ రొడ్డు విస్త‌ర‌ణ‌ ప్రాజెక్టు పనులు గ‌త రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. బైపాస్ రొడ్డు విస్త‌ర‌ణ ప‌నుల్లో భాగంగా 4 లేన్ల రోడ్డుతో పాటు రోడ్డు మధ్యలో సెంట్రల్ మీడియన్, డ్రైనేజీ వ్యవస్థ కోసం ఇరువైపులా సైడ్ డ్రెయిన్లు, పాదచారుల న‌డ‌వ‌డానికి కోసం పేవ్‌మెంట్ (దారి) నిర్మించాల‌ని ప్ర‌ణాళిక‌ను సిద్దం చేశారు.

ఈ బైపాస్ రోడ్డు విస్తరణ పూర్తి అయితే సంగారెడ్డి మున్సిపాలిటి ప‌రిధిలోని వేలాది ప్ర‌జ‌ల‌కు రద్దీ తగ్గే అవకాశం ఉండ‌టంతో పాటు, ఇదే రొడ్డు ద్వారా జాతీయ రహదారికి వెళ్లే వాహనదారులకు రాకపోకలు సులభతరం అవుతాయి. బైపాస్‌ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి హెచ్‌ఎండీఏ టెండర్లు నిర్వహించగా, హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఓ నిర్మాణ సంస్థ పనులు దక్కించుకుంది.

హ‌డ‌విడిగా.. అస్త‌వ‌స్త్యంగా ప‌నులు

సంగారెడ్డి పట్టణంకు ఎంతో కీల‌క‌మైన బైపాస్‌ రోడ్డును విస్త‌ర‌ణ కోసం ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలు, డబ్బాలు తొలిగించకుండానే 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. సెంట్రల్‌ మీడియన్‌, సైడ్‌ డ్రెయిన్‌, న‌డిచేపేవ్‌మెంట్ తో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపట్టాలి. అంటే రొడ్డు విస్త‌ర‌ణ వీలుగా పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతిపాదిత రోడ్డు విస్తరణ పరిధిలో ఇరువైపులా అనేక ఆక్రమణలు ఉన్నాయి. 80 ఫీట్ల రోడ్డు విస్తరణకు తప్పనిసరిగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలు, డబ్బాలను తొలిగించాల్సి ఉంటుంది.

అయితే అధికార పార్టీ కాంగ్రెస్ ముఖ్య‌నేత‌, మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మున్సిపల్‌, ఆర్‌అండ్‌బి, ఎలక్ర్టిసిటీ, హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి బైపాస్‌ రోడ్డులో పర్యటించారు. రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల వ‌ల‌న వ్యాపారులకు, ప్రజలు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. రహదారి విస్తరణలో భాగంగా డబ్బాలను తాత్కాలికంగా తొలగించి, పనులు పూర్తికాగానే అదే చోట మళ్లీ డబ్బాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. ఆర్డీవో నివాసం నుంచి సాయిబాబా కమాన్‌ వరకు కొద్దిమేర అక్రమ నిర్మాణాలు తొలగించారు. మహిళా ప్రాంగణం నుంచి ఎన్‌హెచ్‌-65 వరకు ఇంకా అక్రమ నిర్మాణాలు, డబ్బాలు అలాగే ఉన్నాయి.

అధికారులు రొడ్డు విస్త‌ర‌ణ వీలుగా పూర్తిగా అక్రమ నిర్మాణాలు, డబ్బాలు తొలిగించకుండానే బైపాస్‌ విస్తరణ పనులు మొదలు పెట్టారు. రైట్‌ ఆఫ్‌ వే పూర్తిగా ఖాళీగా లేనప్పటికీ, పలు ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ, పేవ్‌మెంట్‌ పనులు చేపట్టారు. దీంతో ప్రతిపాదిత 80 అడుగుల రోడ్డు విస్తరణ, నాలుగు లేన్ల విధానాన్ని సక్రమంగా అమలు చేయడం సాధ్యం కాదు. ఒక్కొ ప్రాంతంలో ఒక్క త‌ర‌హ‌లో వెడ‌ల్పుతో రొడ్డును విస్త‌రిస్తు వెళ్లారు. రొడ్డు ప‌క్క‌న‌ ఉన్న విద్యుత్‌ స్తంభాలు, చెట్లను పూర్తిగా తొల‌గించ‌కుండానే హ‌డ‌విడిగా రోడ్డు, పేవ్‌మెంట్‌ పనులు చేపట్టారు. దింతో రొడ్డు నిర్మాణం ఒక‌త‌ర‌హ‌లో కాకుండా ఇష్ట‌రీతిన క‌న్పిస్తుంది.

కాంట్రాక్టరు అక్రమ నిర్మాణాలు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న డబ్బాలను తొలిగించకుండానే , య‌ధావిదిగా అటుఇటుగా బైపాస్ రొడ్డు విస్తరణ పనుల చేసిన‌ కార‌ణంగా ప్ర‌తిపాదిత 80 ఫీట్లు రొడ్డు కాస్తా ప‌లు ప్రాంతాల్లో 50 ఫీట్లు వ‌ర‌కు మాత్ర‌మే మిగిలింది. కాంట్రాక్ట‌ర్ చేసిన రొడ్డు విస్త‌ర‌ణ‌ ప‌నులు సైతం నాసిర‌కంగా, నాణ్య‌త లేకుండ ఉన్న‌య‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. సంబంధిత‌ అధికారులు, కాంట్రాక్ట‌ర్ స‌రైన ప్ర‌ణాళిక లేకుండా విస్త‌ర‌ణ ప‌నులు మొద‌లు పెట్ట‌డంతో గ‌త రెండేళ్లుగా ప‌నులు కొన‌సాగుతునే ఉన్నాయి.

కాంగ్రెస్ 50 ఫీట్.. బీఆర్ఎస్ 80 ఫీట్..

సంగారెడ్డి బైపాస్ రోడ్డు విస్త‌ర‌ణ కొసం అక్ర‌మాల తొల‌గింపు జ‌ర‌గక‌పోవ‌డంతో, అధికారులు ప్ర‌ణాళిక‌లోపం, కాంట్రాక్ట‌ర్ అల‌స‌త్వంతో  ప‌నులు అల‌స్యంగా జ‌రుగుతుండ‌టంతో సంగారెడ్డి నాయ‌కుల మ‌ధ్య బ్లేమ్ గేమ్ మొద‌లైంది. ప్రజలకు, వ్యాపారులకు ఆస్తి నష్టం కలిగించకుండానే సంగారెడ్డి బైపాస్ రోడ్డును విస్తరించి అభివృద్ధి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.

మంగళవారం హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలసి బైపాస్ రోడ్డులోని పర్యటించి రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే చింత‌ప్ర‌భాక‌ర్ పై తీవ్ర అరోప‌ణ‌లు చేశారు. 80 అడుగుల రోడ్డు విస్తరణ పేరుతో స్థానిక ఎమ్మెల్యే మార్గంలో ఉన్న భవనాలను కూల్చివేయాలని చూస్తున్నారని అన్నారు. ఎలాంటి కూల్చివేతలు లేకుండా, ప్రజల ఇళ్లు, దుకాణాలు, మెట్లు తొలగించాల్సిన అవసరం లేకుండా 50 అడుగుల రోడ్డుగా దీనిని సులభంగా అభివృద్ధి చేయవచ్చన్నారు.

స్థానిక ఎమ్మెల్యే చింత ప్ర‌భాక‌ర్ మాత్రం ఇంట్లో కూర్చుని హెచ్‌ఎండీఏ కమిషనర్, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేస్తూ బైపాస్ రొడ్డు పనులను నిలిపివేయిస్తున్నారని జ‌గ్గారెడ్డి అరోపించారు. బిల్డింగ్ యజమానులు, ఫుట్‌పాత్ వ్యాపారులు, వాహనదారులకు అనుకూలంగా ఉండేలా త్వరలోనే అభివృద్ధి పనులు పునఃప్రారంభిస్తామని చెప్పారు. సంగారెడ్డి బైపాస్ రొడ్డు 50 ఫీట్ల‌తోనే వేస్త‌మ‌ని జ‌గ్గారెడ్డి తెల్చిచెప్పారు.

మరోవైపు జగ్గారెడ్డి ఆరోపణలపై సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డుపై ప్రతిరోజూ ప్రజలు ట్రాఫిక్ సమస్యలు, గుంతలు, నెమ్మదిగా సాగుతున్న పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50 అడుగుల రోడ్డుతో ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా పరిష్కారం ఎలా అవుతుందో జగ్గారెడ్డి చెప్పాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల రోడ్డుతో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అనేది ప్రజల అభిమతమని అన్నారు.

ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు నిర్మాణం జరగాలని, భవిష్యత్‌లో మళ్లీ రోడ్డు విస్తరణ అవసరం రాకుండా ఇప్పుడే సరైన ప్రణాళికతో పని పూర్తి చేయాలి. సంగారెడ్డిలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా, ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బైపాస్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలన్నదే ఎమ్మెల్యే చింత ప్రభాకర్ లక్ష్యమన్నారు.

ప్ర‌జ‌లు ఏమనుకుంటున్నారంటే..

పెరుగుతున్న జ‌నాభా, విస్త‌రిస్తున్న సంగారెడ్డి ప‌ట్ట‌ణం అవ‌స‌రాల‌కు అనుగుణంగా బైపాస్ రొడ్డు (Sangareddy Bypass Road) విస్త‌ర‌ణ ప‌నులను వేగంగా పూర్తిచేయాల‌ని ప్ర‌జ‌లు కొరుతున్నారు. దాదాపు 30 ఏళ్లు త‌ర్వాత  బైపాస్ రొడ్డు విస్త‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్న‌య‌ని.. ఇప్పుడే వీలైనంత పెద్ద‌దిగా రొడ్డు విస్త‌ర‌ణ చేస్తే భ‌విష్య‌త్తులో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉండ‌వ‌ని చెబుతున్నారు. రొడ్ల‌పైన ఉండే డ‌బ్బాల‌ను, కొన్ని షాపుల‌ను తొల‌గించ‌కుండా, ఉన్న ప్రాంతంలోనే అటు ఇటు రొడ్డు విస్త‌రించుకుంటు పోతే లాభం ఉండ‌ద‌ని బ‌హిరంగంగా చెబుతున్నారు.

భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం హైవేల‌పైనే ఎంతో విలువైన బిల్డింగులను కూల్చుతూ ప‌రిహ‌రం చెల్లిస్తుర‌ని, సంగారెడ్డి ప్ర‌జ‌ల విస్త్ర‌త ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకొని అలాంటి కొంద‌రు వ్యాపారుల‌ను, డ‌బ్బాల‌ను వారిని ఒప్పించి.. వారికి ప‌రిహ‌రం ఇచ్చి బైపాస్ రొడ్డును సాధ్య‌మైనంత పెద్ద‌దిగా విస్త‌రించాల‌ని కొరుతున్నారు. రాజకీయ పట్టింపులను పక్కనపెట్టి, పదే పదే విస్తరణల పేరుతో నిధులు దండగ చేయకుండా.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పెద్ద రోడ్డుని నిర్మించి ట్రాఫిక్ చిక్కుల నుండి శాశ్వత ఉపశమనం కలిగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Also Read : రోహిత్ రికార్డు బద్దలు.. టాప్‌లోకి బట్లర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>