కలం, నిర్మల్: క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ (Nirmal DRO Rathod Ramesh) సూచించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులకు అవగాహన, దిశానిర్దేశ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఆర్వో (Nirmal DRO Rathod Ramesh) మాట్లాడుతూ.. జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని సూచించారు. టీబీని కేవలం వైద్య సమస్యగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి, పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
టీబీ నిర్ధారణ అయిన వారికి ఉచిత చికిత్స నిరంతరాయంగా అందేలా చూడాలని, రోగులు మందులను క్రమం తప్పకుండా వినియోగించేలా పర్యవేక్షించాలని సూచించారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత పరిచయస్తుల్లో అవసరమైన స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు రోగులకు పోషక సహాయం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, మండల ప్రత్యేక అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read : వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు పిల్లలు మృతి
Follow Us On : WhatsApp

