కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా కొత్తపల్లి పట్టణంలోని చారిత్రాత్మక ఊర చెరువు (Kothapalli Cheruvu) ఆక్రమణలు, అక్రమ లేఅవుట్లపై బీజేపీ నాయకులు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మాజీ బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేంచ శేఖర్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ మిట్టపల్లి రమేష్కు వినతిపత్రం అందజేశారు. కొత్తపల్లి ఊర చెరువుకు సంబంధించిన సర్వే నంబర్లు 686, 687 పరిధిలో చెరువు ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మట్టి నింపుతూ అక్రమంగా లేఅవుట్లు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల అండతోనే చెరువు ఆక్రమణలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. అలాగే రోడ్డుపై ఉన్న కల్వర్టును సైతం కాంగ్రెస్ నాయకుడు కూల్చివేశారని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెరువు ఆక్రమణలపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆక్రమణలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఊర చెరువును పరిరక్షించి, ఆ ప్రాంత రైతులను ఆదుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముత్తునూరి హరీష్, మేకల నరేష్, దుబాయ్ సునీల్, మహేష్, హరిబాబు, ప్రవీణ్, శివ రమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

