కలం, వెబ్డెస్క్: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) కేసులోకి సీపీ సజ్జనార్ (Sajjanar) ఎంట్రీ ఇచ్చారు. ఉప్పరపల్లి కోర్టు అనుమతి మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో రిమాండ్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని సజ్జనార్ విచారించారు. స్వయంగా స్టేషన్కు వచ్చి సుమారు ఐదు గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. మాయమైన ఐఫోన్, ఘటనలో వాడిన కత్తి ఎక్కడ పడేశావంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ వివరాలు, విచారణ తీరును అక్కడి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సజ్జనార్ ముందు ఉదయ్ కృష్ణారెడ్డి తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. తనతో సన్నిహితంగా ఉండి మరొకరిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకనే వేధింపులకు పాల్పడినట్లు అంగీకరించాడు. మరోవైపు సజ్జనార్ అడిగిన చాలా ప్రశ్నలకు ఉదయ్ దాటవేసే ధోరణితోనే సమాధానాలు ఇచ్చాడని తెలుస్తోంది. సజ్జనార్ విచారణతో ఈ కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో కీలకంగా మారనున్న ఉదయ్ ఫోన్ ఇప్పటికీ దొరకలేదు. మహిళా ట్రైనీ ఐపీఎస్తో పాటు ఉదయ్ కృష్ణాడ్డి మరికొందరు యువతులతో రిలేషన్షిప్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉదయ్ ఫోన్ దొరికితే అన్ని వివరాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

