కలం, వెబ్ డెస్క్: నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై వైద్యం పొందుతున్నారని.. వారు ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆకాంక్షించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ నిర్వహించి మాట్లాడారు. మంచి పేరు ఉన్న వైద్యులతో కేసీఆర్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సెక్యూరిటీ రివ్యూ అని పెట్టి భద్రతను కుదింపు చేసిందని.. పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా సెక్యూరిటీ కుదింపు చేసిందని అన్నారు. వరంగల్ జిల్లాలో ప్రాణాలకు తెగించి పెద్ది రాజకీయాల్లోకి వచ్చాడని కొనియాడారు. 8 ఏళ్లుగా పార్టీకి వరంగల్ జిల్లా అద్యక్షుడు పదవిలో ఉన్నాడని గుర్తు చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) చాలా ఒత్తిడికి లోనయ్యారన.. ఆయనను ప్రభుత్వం ఒత్తిడికి గురి చేసిందని ఆర్ఎస్పీ ఆరోపించారు. పెద్ది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఆయన పని చేసినప్పుడు.. సీవీ ఆనంద్ కమిషనర్గా చేశారని చెప్పారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రూ. 1100 కోట్ల స్కాంను ఆయన బయటకు తీశాడని అన్నారు. గురుకుల స్కూళ్లలో బంకర్ బెడ్లలో కూడా కుంభకోణాలు బయటకు తీశాడని అన్నారు. రేవంత్ రెడ్డి స్కాములు బయటకు రాగానే పెద్ది సుదర్శన్ రెడ్డి గన్ లైసెన్స్ ఇవ్వకుండా చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కుంభకోణాలపై మాట్లాడవద్దు అని స్వయంగా పోలీసులు చెప్పారని ఆరోపించారు. దీంతో పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని అన్నారు.

