కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ సేవలు (Registration Services) నిలిచిపోయాయి. సర్వర్ పనిచేయకపోవడంతో స్లాట్ బుకింగ్, ఇతర సేవలకు అంతరాయం కలుగుతోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయ విక్రయదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నెలల్లో ఇలా జరగడం నాలుగోసారి. సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు చెబుతుండగా.. ఎందుకు పరిష్కారం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
అన్నీ కీలకమైనవే..
భూముల క్రయ విక్రయాలు సహా ఇళ్లు, ఆస్తుల్లో మార్పులు చేర్పులు, ఈ–కేవైసీ వంటి కీలకమైన సేవలు రిజిస్ట్రేషన్ ద్వారానే జరుగుతుంటాయి. వీటి కోసం ముందుగానే స్లాట్లు బుక్ చేసి పెట్టుకుంటారు. చాలా మంది మంచి రోజు, పక్కాగా ముహూర్తం చూసుకుని మరీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అయితే గత రెండు రోజులుగా సర్వర్ పూర్తిగా నిలిచిపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
అధికారులను అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు. రిజిస్ట్రేషన్ సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు టెక్నికల్ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ల ఐజీ కార్యాలయం పేర్కొంది.

