కలం, వనపర్తి: తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. పార్టీ బలోపేతానికి జీవితాంతం అంకితభావంతో పనిచేసిన నిఖార్సైన ఉద్యమకారుడని కొనియాడారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. నాయకులు మన్నే గోవర్ధన్ రెడ్డి, రావుల విజయ్, నరసింహ, పాతాళ నరసింహ, నాగరాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.

