కలం, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో(Ranji Trophy) సంచలన ఇన్నింగ్స్తో జమ్మూ కశ్మీర్కు చారిత్రాత్మక టైటిల్ అందించిన యువ బ్యాటర్ ఖమ్రాన్ ఇక్బాల్(Qamran Iqba) మరో సవాల్కు సిద్ధమయ్యాడు. దులీప్ ట్రోఫీ కోసం నార్త్ జోన్ జట్టులో చోటు దక్కించుకున్న 24 ఏళ్ల ఖమ్రాన్.. ఈసారి ముందుగానే బెంగళూరుకు చేరుకుని సన్నద్ధమవుతున్నాడు. గత బెంగళూరు ప్రయాణం మాత్రం ఖమ్రాన్కు తీవ్ర ఒత్తిడితో సాగింది. ఫిబ్రవరి 23న రంజీ ట్రోఫీ ఫైనల్కు ఒక్కరోజు ముందు శ్రీనగర్లో ఉన్న అతడికి జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఓపెనర్ శుభమ్ ఖజురియా గాయపడటంతో ఖమ్రాన్ను వెంటనే హుబ్బళ్లికి రావాలని జట్టు కోరింది.
దీంతో శ్రీనగర్ నుంచి దాదాపు 2,800 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఢిల్లీ, ముంబై మీదుగా అర్ధరాత్రి ప్రయాణించి.. మ్యాచ్ రోజున ఉదయం 8 గంటలకు హుబ్బళ్లికి చేరుకున్నాడు. టాస్కు కేవలం గంట ముందు మైదానానికి వెళ్లాడు. అయినప్పటికీ ఏమాత్రం తడబడకుండా రెండో ఇన్నింగ్స్లో అజేయంగా 160 పరుగులు చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్తో జమ్మూ కశ్మీర్ కర్ణాటకపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజయం సాధించి తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. ఆ మ్యాచ్ తనకు ప్రత్యేకమైన అనుభవమని ఖమ్రాన్ తెలిపాడు. ప్రయాణ అలసట ఉన్నప్పటికీ జట్టు మొత్తం సమష్టిగా రాణించడం వల్లే విజయం సాధ్యమైందని చెప్పాడు.ఇప్పుడు అతడి దృష్టి దులీప్ ట్రోఫీపై పడింది. నార్త్ జోన్ 15 మంది సభ్యుల జట్టులో ఖమ్రాన్తో పాటు జమ్మూ కశ్మీర్ రంజీ జట్టుకు చెందిన మరో ఐదుగురికి చోటు లభించింది. ఆదివారం నుంచి నార్త్ జోన్, వెస్ట్ జోన్ మధ్య పోరు ప్రారంభం కానుంది. ఈసారి ఖమ్రాన్ నాలుగు రోజుల ముందుగానే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు చేరుకున్నాడు. సమయం తీసుకుని శిక్షణ పొందుతూ టోర్నీకి సిద్ధమవుతున్నాడు.
ఆఫ్-సీజన్లో శిక్షణ శిబిరాలు నిర్వహించడం, బుచ్చిబాబు టోర్నీ వంటి పోటీల్లో ఆడించడం తమకు ఎంతో ఉపయోగపడిందని వివరించాడు. వివిధ రకాల పిచ్లపై సాధన చేసే అవకాశం లభిస్తోందని చెప్పాడు. కోచ్ అజయ్ శర్మ అందించే సాంకేతిక సూచనలు కూడా తన ఆటకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఖమ్రాన్ పేర్కొన్నాడు. చిన్న వయసులోనే తనలో క్రికెట్పై ఆసక్తిని పెంచింది తండ్రేనని ఖమ్రాన్ గుర్తుచేసుకున్నాడు. అండర్-14 స్థాయి నుంచి వయసు విభాగాలలో ఎదుగుతూ నార్త్ జోన్, భారత్ అండర్-19 జట్టుకు చేరాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అయినప్పటికీ భారత్ అండర్-19 జట్టుతో మూడు సిరీస్లు ఆడిన అనుభవం తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పాడు. ఆ సమయంలో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. దులీప్ ట్రోఫీలోనూ తన బ్యాటింగ్తో ఆకట్టుకుని కెరీర్లో మరింత ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

