కలం, వెబ్ డెస్క్ : లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటుకు వచ్చేందుకు హోం మంత్రి భయపడుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. దేశ హోం మంత్రికి ఇక్కడికి వచ్చి కూర్చునే ధైర్యం లేకపోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించారు.
తాను వస్తున్న సమయంలో హోం మంత్రి కాన్వాయ్ని చూశానని, కారులో కూర్చున్న ఆయన భయంతో వణికిపోతూ కనిపించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హోం మంత్రి ఈరోజు సభకు ఎందుకు రాలేదో అందరికీ తెలుసని, ఆయన తీవ్ర భయాందోళనలో ఉన్నారని విమర్శించారు. మన దేశ విద్యార్థులపై కాల్పులు జరపాలని ఆదేశించింది ఆయనేనని, విద్యార్థులపై బుల్లెట్లు ప్రయోగించి వారి రక్తం చిందడానికి ఆయనే కారణమని ధ్వజమెత్తారు. భారతీయ విద్యార్థులపై కాల్పులు జరపాలని హోం మంత్రే స్వయంగా ఆదేశాలు ఇచ్చారని, అందుకే సభను ఎదుర్కొనే ధైర్యం లేక ఇక్కడికి రాలేకపోతున్నారని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.

