కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని, ఆయన కనుసన్నల్లోనే నగరంలో ఇసుక, మట్టి, భూ దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) ధ్వజమెత్తారు. ఆదివారం ఖానాపురం హవేలి పరిధిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గతంలో తనపై ‘కాశీం రజ్వీ’ అంటూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తులే, ప్రస్తుతం మంత్రి తుమ్మల, ఆయన కుమారుడి వెంటే ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు బీఆర్ఎస్ తోనే ఉన్నారన్నారు. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత తుమ్మలకు లేదని, ఏ పార్టీలో ఉన్నా ఆయన మంత్రి పదవులను అనుభవించడం తప్ప ఖమ్మం ప్రజలకు చేసిందేమీ లేదని పువ్వాడ విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే ఖమ్మం నగరంలో ఊహించని అభివృద్ధి జరిగిందని, వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
సీతారామ ప్రాజెక్టు కాలువ సీసీ లైనింగ్ ఏడాదికే కూలిపోవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కేంద్రం నిర్మించిన దేవరపల్లి–ఖమ్మం జాతీయ రహదారిని తమ ఖాతాలో వేసుకునేందుకు తుమ్మల ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలోనే మున్నేరు తీగల వంతెన, రక్షణ గోడలు, బస్ స్టాండ్, గోళ్లపాడు చానెల్ సుందరీకరణ పనులు జరిగాయన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ సినిమాను తలపిస్తోందని అన్నారు.

