కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 సీజన్ మొదలవుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్కు టీమ్ ఇండియా మాజీ ఆటగాడు చతేశ్వర్ పుజారా (Pujara) కీలక సూచనలు చేశారు. మైదానంలో మరీ అతిగా రిలాక్స్డ్గా ఉండటం జట్టుపై ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత సీజన్లో అక్షర్ నేతృత్వంలోని ఢిల్లీ టీమ్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. మొదటి నాలుగు మ్యాచ్ల్లో వరుసగా విజయం సాధించి మంచి ఊపు మీద కనిపించింది. అయితే ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలను తృటిలో కోల్పోయి, ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అక్షర్ పటేల్ ఒత్తిడిని తీసుకోకుండా చాలా ప్రశాంతంగా ఉంటారని పుజారా (Pujara) పేర్కొన్నారు. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఆటగాళ్లకు అండగా నిలిచే ఇలాంటి వ్యక్తిత్వం అవసరమని చెబుతూనే, ఒక హెచ్చరిక కూడా చేశారు. ప్రశాంతంగా ఉండటానికి, అతిగా వ్యవహరించడానికి మధ్య సన్నని గీత ఉంటుందని వివరించారు. రిలాక్స్డ్గా ఉండటం వల్ల ఒక్కోసారి టీమ్ మూమెంటం చేజారిపోయే ప్రమాదం ఉందని, ఈసారి అక్షర్ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరోవైపు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అక్షర్ బౌలింగ్ తీరుపై స్పందించారు. 2025 సీజన్లో అక్షర్ కేవలం 5 వికెట్లు మాత్రమే తీసి గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అప్పట్లో డిఫెండ్ చేసుకోవడానికి తగినన్ని పరుగులు బోర్డు మీద లేకపోవడమే అందుకు కారణమని విశ్లేషించారు. అయితే ఈసారి పవర్ప్లేలో అక్షర్ బౌలింగ్ చేస్తాడని, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్లతో కలిసి బౌలింగ్లో అక్షర్ గట్టిగా పుంజుకుంటాడని కైఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

