కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని కమ్మర్లపల్లి, విటలాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద గురువారం రైతులు ధర్నా(Farmers Protest) నిర్వహించారు. వ్యవసాయ రంగానికి నిరంతరంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టేషన్ ఎదుట రైతాంగం బైఠాయించింది. విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే స్పందించి 24 గంటల కరెంట్ ఇవ్వాలని వారు ఆందోళన చేపట్టారు.
రైతులు చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, విటలాపూర్ సబ్ స్టేషన్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి, స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.

