కలం, నిర్మల్: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో (PM Vishwakarma Yojana) భాగంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ (Dilawarpur) మండలంలోని 8 గ్రామాలకు చెందిన 65 మంది రజక కుల లబ్ధిదారులకు ఉచిత వాషింగ్ మిషన్లను మంగళవారం పంపిణీ చేశారు. పీఎం విశ్వకర్మ యోజన ఇంప్లిమెంటేషన్ జిల్లా కమిటీ సభ్యుడు సామ రాజేశ్వర్రెడ్డి లబ్ధిదారులకు వాషింగ్ మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా సామ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ చేతివృత్తుల వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకం జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని తెలిపారు.
పథకంలో భాగంగా మొదటి విడతలో రూ.లక్ష రుణం పొందిన లబ్ధిదారులు బ్యాంకులకు సకాలంలో రుణాలను తిరిగి చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం రూ.2 లక్షల రుణం పొందేందుకు లబ్ధిదారులు 21 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు ఈ శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా తమకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలుగుతోందని లబ్ధిదారులు తెలిపారు. తమ వృత్తికి అవసరమైన వాషింగ్ మిషన్లు ఉచితంగా అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

